‘పనికిరాని ఎన్జీవోల నివేదికలు చూసి ప్రశ్నిస్తారా?’: నార్వే జర్నలిస్ట్‌పై భారత అధికారి ఫైర్

  • భారత్‌లో మానవ హక్కులపై ప్రశ్నించిన జర్నలిస్ట్
  • అజ్ఞానపు ఎన్జీవోల నివేదికలను నమ్మొద్దన్న సిబి జార్జ్
  • భారత్‌లో మీడియా స్వేచ్ఛను ప్రస్తావించిన అధికారి
  • ప్రాథమిక హక్కులు, చట్టపరమైన రక్షణలపై స్పష్టీకరణ 
  • ఓటు ద్వారా ప్రభుత్వాన్ని మార్చడమే మానవ హక్కులకు నిదర్శనమని వ్యాఖ్య
నార్వే రాజధాని ఓస్లోలో జరిగిన మీడియా సమావేశంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ స్థానిక మహిళా జర్నలిస్ట్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ నార్వే పర్యటన సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు, పత్రికా స్వేచ్ఛపై సదరు విలేకరి పదే పదే ప్రశ్నించారు. ‘‘మేము మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? మీ దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ఆపుతామని ప్రమాణం చేయగలరా?’’ అంటూ ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ ప్రశ్నలపై సిబి జార్జ్ తీవ్రంగా స్పందిస్తూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థల పరిమాణాన్ని, గొప్పతనాన్ని వివరించారు. ‘‘భారతదేశం ఎంత పెద్దదో, ఇక్కడి మీడియా రంగం ఎంత విస్తృతమైనదో చాలామందికి అవగాహన లేదు. కేవలం దిల్లీలోనే ఇంగ్లిష్, హిందీ ఇతర భాషల్లో కనీసం 200కి పైగా టీవీ ఛానళ్లు ఉన్నాయి. ప్రతిరోజూ సాయంత్రం ఎన్నో బ్రేకింగ్ న్యూస్‌లు వస్తుంటాయి. అంతర్జాతీయంగా కొందరు.. ఏవో కొన్ని పనికిరాని, అజ్ఞానపు ఎన్జీవోలు ప్రచురించే ఒకట్రెండు తప్పుడు నివేదికలను చదివి, ఇక్కడికి వచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు’’ అంటూ మండిపడ్డారు.

భారత రాజ్యాంగం పౌరులందరికీ ప్రాథమిక హక్కులను ఇస్తోందని, ఏవైనా ఉల్లంఘనలు జరిగితే కోర్టులను ఆశ్రయించే చట్టపరమైన రక్షణలు ఉన్నాయని జార్జ్ స్పష్టం చేశారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన మొదటి రోజు నుంచే భారతదేశం మహిళలకు ఓటు హక్కు కల్పించిందని, ప్రపంచంలోని ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు దశాబ్దాల తర్వాత కానీ మహిళలకు ఆ హక్కు ఇవ్వలేదని గుర్తుచేశారు. మానవ హక్కులకు అత్యుత్తమ ఉదాహరణ ఓటు వేసి ప్రభుత్వాన్ని మార్చే హక్కు అని, అది భారతదేశంలో నిరంతరం జరుగుతూనే ఉందని, దానికి తాము గర్వపడుతున్నామని ఆయన దీటుగా సమాధానం ఇచ్చారు. ఈ వాదనల మధ్య సదరు జర్నలిస్ట్ ఓ దశలో మీడియా సమావేశం నుంచి బయటకు వెళ్లి మళ్లీ కాసేపటికి తిరిగి రావడం గమనార్హం.

Syed Akbaruddin
India
Norway
Sibi George
Indian Foreign Ministry
Human Rights Violations
Press Freedom
Oslo
Narendra Modi
Indian Democracy

More Telugu News